Sunday 29 November 2015

వాస్తులో  ఎత్తుపల్లాల  ప్రాముఖ్యత
 సూర్యదేవర వేణుగోపాల్
ఎత్తుపల్లాలు వాస్తు నందు చాలా ముఖ్యమైనవి. వాస్తు లో గల అన్ని నిర్మాణ నియమాలు ఎత్తుపల్లాల ప్రాతిపదికనే రూపొందించబడినవి.. యే ఏ దిశలందు మెరక ఉండాలి, యే ఏ దిశలందు పల్లం ఉండాలన్న విషయాన్ని వాస్తుశాస్త్రం స్పష్టంగా తెలియచేసింది. గృహం లో ఉండే వారి జీవితాలను ఈ ఎత్తుపల్లాలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఎత్తుపల్లాలను శాస్త్ర బద్ధం గా పాటిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఈ నియమాలను పాటించని పక్షం లో తీవ్ర నష్టాలు ఖచ్చితంగా కలుగుతాయి. అందువల్ల గృహ నిర్మాణ సమయంలో ఈ నియమాలను శాస్త్ర బద్ధంగా పాటించాలి.
స్థూలంగా చెప్పాలంటే దిక్కుల విషయంలో తూర్పు, ఉత్తర ,భాగాలు పల్లంగా ఉండాలి. దక్షిణ, పడమర దిశలందు మెరకగా ఉండాలి. ఈ నియమం భూమి, ఫ్లోరింగ్, శ్లాబ్,వసారా మొదలగు అన్ని నిర్మాణ విషయాలకు వర్తిస్తుంది.ఈ నియమానికి విరుద్దంగా నిర్మాణాలు ఉంటే  అందులో నివసించేవారికి అనేక కష్టనష్టాలు వస్తాయి. ఈ ఎత్తుపల్లాల గురించి లోతుగా అధ్యయనం చేద్దాం.
మెరక పల్లాల ప్రాతిపదిక పై మన మహర్షులు స్థలాలను 4 రకాలుగా వర్గీకరించారు. అవి  గజపృష్ట భూమి:  ధైత్య పృష్ట భూమి:  నాగ పృష్ట భూమి:  మరియు కూర్మ పృష్ట భూమి. భూమి యొక్క ఎత్తుపల్లాలను బట్టి ఈ వర్గీకరణ జరిగింది. జాగ్రత్తగా పరిశీలిస్తే దిక్కులు, విదిక్కులందు ఎత్తుపల్లాలు  యే విధం గా ఉండాలో కూడ ఈ వర్గీకరణ లో తెలియచేయడం జరిగింది.
దక్షిణం, పడమర, నైరుతి, వాయవ్యం, దిశలు మెరక గాను మిగిలిన ఆగ్నేయ, ఈశాన్య, తూర్పు, ఉత్తర దిశలు పల్లం గాను ఉన్న భూమిని గజపృష్ట భూమి అని అంటారు. స్టూలంగా చెప్పాలంటే ఉత్తరం కంటే దక్షిణం మరియు తూర్పు కన్నా పడమర మెరకగా ఉన్న భూమే గజపృష్ట భూమి. ఈ భూమి అన్ని రకాలైన సుఖ సంతోషాలను ప్రసాదిస్తుంది. ఇది నివాసానికి యోగ్యమైన భూమి.
           

            గజపృష్టే భవేద్వాస సలక్ష్మి ధనపూరిత:
            ఆయు:వృద్దికరీ నిత్యం జాయతే నాత్ర సంశయ:                                                                                                                                             “జ్యోతిర్నిబంధం”
పై శ్లోకం” జ్యోతిర్నిబంధం” అను ప్రాచీన వాస్తు గ్రంధం నుండి గ్రహించబడినది. ఈ శ్లోకం ప్రకారం గజపృష్ట భూమి లో నివసించేవాళ్ళకు దీర్ఘ ఆయుషు, సంపద, నిత్యం పెరుగుతూ ఉంటుంది.గృహస్థు ఎల్లప్పుడు  సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాడు.
ధైత్య్హ్యపృష్ఠ భూమి లో తూర్పు, ఆగ్నేయం, మరియు ఈశాన్యం మెరకగా ఉంటాయి. మిగిలిన దిశలైన నైరుతి, పడమర, దక్షిణం మరియు వాయవ్యం పల్లం గా ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే తూర్పు భాగం మెరకగా ఉండి పడమర భాగం పల్లంగా ఉన్న భూమి ధైత్యపృష్ట భూమి. ఈ భూమి అత్యంత వినాశకారి.
                        ధైత్యపృష్ఠే కృతేవాసే లక్ష్మీర్ణయాతి మందిరం
                        ధనపుత్ర పశూనాంచ హానిరేవ న సంశయ:               “జ్యోతిర్నిబంధం.”

పై శ్లోకం ప్రకారం ఇందులో నివసించే వాళ్ళకు ధన నాశనం,పుత్ర పశు మరియు వంశ నాశనం జరుగవచ్చు.ఈ భూమి నివాసయోగ్యం కాదు.
ఉత్తర దక్షిణాలు మెరకగా ఉండి తూర్పు పడమరలు దీర్ఘంగా, పొడవుగా ఉన్న భూమి నాగపృష్ట భూమి.ఇది నివాసానికి పనికిరాదు.
                        నాగపృష్టే యధావాసో మృత్యురేవ న సంశయ:
                        పత్నీహాని: పుత్రహాని: శత్రువృద్ది: పదేపదే.
                                                                                    “జ్యోతిర్నిబంధం.”
మధ్య భాగం ఎత్తుగా ఉండి మిగిలిన 4 దిశలు పల్లంగా ఉన్న భూమిని కూర్మపృష్ట భూమి అని అంటారు.ఈ భూమి ఫలితాల పై కొన్ని ప్రాచీన గ్రంధాలు అనుకూలంగా తెలియజేస్తే మరికొన్ని గ్రంధాలు ప్రతికూలంగా తెలియజేశాయి.
”ధనం ధాన్యం భవేత్తస్య నిశ్చ్హితం విపులం శుభం”.      జ్యోతిర్నిబంధం
పై శ్లోకం ప్రకారం  కూర్మపృష్ట భూమి ధనధాన్యాలను, ఆయురారోగ్యాలను ప్రసాదిస్తుంది.అయితే”“విశ్వకర్మప్రకాశిక” అను మరో ప్రాచీన వాస్తు గ్రంధం
“ కూర్మే ధన నాశనం “  అని తెలియజేసింది.ఇప్పటి పరిస్థితుల ప్రకారం పరిశీలిస్తే ఈ భూమి అంతగా మంచి ఫలితాలు ఇవ్వడం లేదు అని చెప్పవచ్చును.
జ్యోతిర్నిబంధం, విశ్వకర్మ ప్రకాశిక ఇంకా నారద సంహిత వంటి అనేక ప్రాచీన వాస్తు గ్రంధాలు అప్పటి పరిస్థితులను, అప్పటి అవసరాలను,కాలాన్ని బట్టి స్థల విభజన చేశాయి. ఈ విభజన లో కొన్ని వాస్తు నియమాలు తెలియజేయబడినవి.. అయితే ఇప్పటి కాలంలో స్థలాలను వాస్తుకు అనుగుణంగా సవరించి గృహాలను నిర్మించవచ్చు. యే విధమైన స్థలమునైనా వాస్తుకు అనుగుణంగా సవరించి నిర్మాణాలు చేపట్టవచ్చు. వాస్తు లో ఎత్తుపల్లాలు సరియైన సమన్వయంతో ఉండాలి. ఈ నియమాలను తప్పనిసరిగా పాటించాలి. నిర్మాణాలలో ఎత్తుపల్లాలు, వాస్తు కు అనుగుణంగా యే విధంగా ఉండాలో స్థూలంగా పరిశీలిద్దాం.
ఏ స్థలం లో నైనా లేదా నిర్మాణంలో నైనా తూర్పు, ఈశాన్య దిశలు పల్లంగా ఉండాలి. నైరుతి, దక్షిణం, పడమర మరియు ఆగ్నేయ దిశలు మెరకగా ఉండాలి. అంటే నైరుతి, దక్షిణం, పడమర ,ఆగ్నేయ మరియు వాయవ్య దిశలు, తూర్పు, ఉత్తర,మరియు ఈశాన్య దిశలకన్నా మెరకగా ఉండాలి.ఈ విధమైన అమరిక వాస్తు పుష్టిని కలిగించి గృహస్థు కు అనేక శుభాలను ప్రసాదిస్తుంది.ఈ సూత్రానికి వ్యతిరేకంగా నిర్మాణాలు ఉంటే అనేక నష్టాలు వస్తాయి.. దిక్కులలో దక్షిణ, పడమర దిక్కులు తూర్పు, ఉత్తర దిశలకన్నా మెరకగా ఉండాలి. అదేవిధంగా నైరుతి ఆగ్నేయం కన్నా మెరకగా ఉండాలి.వాయవ్యం ఆగ్నేయం కన్నా పల్లంగా ఉండాలి. ఇంకా ఈశాన్యం వాయవ్యం కన్నా పల్లంగా ఉండాలి. అంటే అన్నిటికంటే నైరుతి మెరకగాను, ఈశాన్యం పల్లంగాను ఉండాలి.ఈ విధమైన కూర్పు అనేక సంపదలకు రహదారి కాగలదు. ఇటువంటి గృహాలలో నివసించేవారికి అన్ని విషయాలలో అభివృద్ది, సంఘం లో పేరు ప్రతిష్టలు ఉంటాయి.ఈ ఎత్తుపల్లల నియమాలను భూమి విషయం లో ఇంకా నిర్మాణ విషయాలైన Flooring, slabs, వసారాలు,ప్రహరీ మొదలగు అన్నిటి యందు పాటించాలి.
గృహానికి వెలుపల ఉన్న ఎత్తుపల్లాలు కూడా ముఖ్యమైనవే. ఇవి కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. గృహం వెలుపల ఉన్న వాస్తు దోషాలను సవరించలేము. ప్రహరీ నిర్మిస్తే వెలుపలి దోషాలు వాటి ప్రభావాలు తగ్గిపోతాయి.కనుక యే నిర్మాణాని కైనా ప్రహరీ చాలా ముఖ్యం.వివిధ దిక్కులలో ఉన్న ఎత్తుపల్లాల వల్ల వివిధ రకాలైన ప్రభావాలు కలుగుతాయి. కొన్ని దిక్కులలో ఉన్న మెరక వల్ల తీవ్ర నష్టాలు  కలుగుతాయి. మరికొన్ని దిక్కులలో ఉన్న పల్లం వలన అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతీ దిక్కుకు ఆ దిక్పతికి సంబందించిన ఎత్తుపల్లాల నియమాలు ఉన్నాయి. ఈ నియమాలకు భంగం రాకుండా నిర్మాణం జరగాలి. దిక్కులకు సంబందించిన నియమాలు యేమిటి  వాటిని యే విధంగా పాటించాలి అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. ప్రధాన దిక్కులైన  తూర్పు, ఉత్తరం, దక్షిణం మరియు పడమర,  విదిక్కులైన నైరుతి,ఆగ్నేయం, వాయవ్యం మరియు ఈశాన్యం స్థానాలలో ఎత్తుపల్ల నియమాలు యే విధం గా ఉండాలో వాటి ఫలితాలు యే విధం గా ఉంటాయో “అపరాజితపృచ్చ” అను ప్రాచీన వాస్తు గ్రంధం తెలియజేసింది. వీటిని గురించి వివరంగా విడివిడిగా తెలుసుకుందాం.
తూర్పు:  తూర్పు ఎప్పుడు పల్లంగానే ఉండాలి. పడమర కంటే తప్పని సరిగా పల్లంగా ఉండాలి. తూర్పు మెరకగా ఉంటే గృహం లో నివసించే మగవారికి అరిష్టం. వారికి కలిసిరాదు. వారు యే వృత్తిలోను స్థిరపడలేరు. తూర్పు పల్లం గా ఉంటే వంశ వృద్ది, సంపద, ఆరోగ్య వృద్ది, ఉంటాయి. మగసంతానం అభివృద్ది పధంలో ఉంటారు. రాజకీయ రంగంలో ఉండేవారికి తూర్పు తప్పనిసరిగా పల్లం గా ఉంటారు.
                                                పూర్వప్లవా ధరా శ్రేష్టా ఆయు: శ్రీ బలవర్ధినీ
                                                సర్వసంపత్కరీ పుంసాం ప్రాసాదానామ్ విభూతిధా
                                                                                                “అపరాజిత పృచ్చ”
           
పై  శ్లోకం ప్రకారం పల్లమైన తూర్పు మంచి ఆయుర్దాయము, సిరిసంపదలు, రాజ్యపూజ్యతను కలుగజేస్తుంది. తూర్పున పల్లంగా ఉన్న దేవాలయము ప్రసిద్దిని పొందుతుంది. కాబట్టి సుఖసంతోషాల కోసం తూర్పును పల్లంగా ఉంచాలి.
ఆగ్నేయం: ఆగ్నేయం ఎత్తుగా ఉండాలి. నైరుతి కన్నా పల్లంగా, వాయవ్య, ఈశాన్యాల కన్నా మెరకగా ఉండాలి. ఆగ్నేయం, ఈశాన్యవాయవ్యాల కన్నా పల్లంగా ఉంటే, అగ్నిప్రమాదాలు, స్త్రీలకు అనారోగ్యం, బంధు మిత్రులతో సమస్యలు, ఆర్ధికసమస్యలు ఉంటాయి. కొన్ని సందర్భాలలో ఆగ్నేయం పల్లమైతే మధుమేహ సమస్య. మూత్రపిండాల సమస్యలు, అజీర్ణ సమస్యలు ఆ స్థలంలో నివసించేవారికి వచ్చే అవకాశం ఉంది.
                                    ఆగ్నేయ ప్లవకా భూమి అగ్నిదాహ భయావహా
                                    శత్రు సంతాపదా నిత్యం కలి దోషోగ్ని ప్లవ: స్మృత: 
                                                                                                “అపరాజిత పృచ్చ”
ఆగ్నేయం పల్లంగా ఉన్న ప్రదేశం అగ్ని భయాన్ని, శత్రు సమస్యను.ఇంకా చెడ్డ పనుల పట్ల మనసును మళ్ళించడం వంటి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. కనుక ఆగ్నేయం పల్లంగా ఉండకుండా ఉండవలసినంత ఎత్తు లో ఉండాలి.
దక్షిణం: దక్షిణం తప్పనిసరిగా మెరకగా ఉండాలి. దక్షిణం మెరక ఉంటే, మంచి ఆరోగ్యం, ఆర్ధికాభివృద్ది ఉంటాయి. దక్షిణం పల్లమైతే, ప్రమాదాలు, ఆర్ధిక నష్టం, ఆరోగ్య సమస్యలు, ప్రమాదాలలో అవయువ నష్టం వంటి సమస్యలు వస్తాయి. దక్షిణం పల్లమైన దేవాలయం కూడా అభివృద్దికి నోచుకోదు.
                        నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
                        ధన హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:     “ అపరాజిత పృచ్చ”
                                                                                   
ధన ఆరోగ్య హాని నిత్యం రోగభయం వంటి నష్టాలు దక్షిణం పల్లమైన భూమి ప్రసాదిస్తుంది. ఇటువంటి స్థలంలో దేవుడు కూడా నశిస్తాడు అని పై శ్లోకం తెలుపుతోంది. కనుక చక్కటి జీవితానికి దక్షిణాన్ని తప్పనిసరిగా మెరకగా ఉంచాలి.

నైరుతి: ఇది అన్నింటికన్నా ప్రమాదకరమైనది. ఇది అన్నీ దిశల కన్నా తప్పనిసరిగా మెరకలో ఉండాలి. నైరుతి పల్లమైన భూమిలో నివశిస్తే అనేక అరిష్టాలు కలుగుతాయి. యాక్సిడెంట్లు, ప్రవర్తనా దోషాలు, వృత్తి ఉద్యోగ సమస్యలు, ఆర్ధిక ఆరోగ్య నష్టం, గుండె సమస్యలు,శస్త్ర చికిత్సలు, సంతానం లేకపోవడం,వంశనాశనం, వంటి తీవ్ర సమస్యలు వస్తాయి. నైరుతి వాస్తు దోషం గృహం లో నివసించే పెద్ద సంతానం, యజమాని, యజమానురాలిపై తీవ్రం గా పనిచేస్తుంది. నైరుతి అన్నీ దిశల కన్నా మెరకగా ఉంటే సకల శుభాలు కలుగుతాయి.
                                    ప్రవర్తయే గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్
                                    ధనహానిమ్ తధా నిత్యం కురుతే నైరుతి ప్లవా.
                                                                                    అపరాజితపృచ్చ.
నైరుతి పల్లం ధన హానికి అనారోగ్యానికి  మృత్యువుకు హేతువు అవుతుంది. ఆకస్మిక మరణాలకు ప్రమాదాలకు నైరుతి కారణం. కనుక ఈ దిక్కును తప్పనిసరిగా మెరకగా ఉంచాలి.
పడమర: ఈ దిశ మెరకగా ఉండాలి. తూర్పు కన్నా తప్పనిసరిగా మెరకగా ఉండాలి. పడమర పల్లమైతే మగవారికి నష్టం. కలిసిరాదు. పుత్ర సంతానం ఉండకపోవచ్చు. పుత్ర సంతానం నష్టం కావచ్చు. కనుక పడమర తప్పనిసరిగా మెరకగా ఉండాలి.
                                    పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని
                                    శోకదాహ్యామ్ కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.   -  అపరాజితపృచ్చ
                                                                                   
పడమర పల్లం ధనధాన్యాలను నాశనం చేస్తుంది. శోకం,వంశనాశనం కలుగుతుంది. కనుక పడమర ఎత్తులో ఉండాలి. పడమర ఎత్తులో ఉంటే సకల సంపదలు కలుగుతాయి. మగవారు ప్రయోజకులు గా ఉంటారు. సంఘం లో ప్రతిష్ట ఉంటుంది.
వాయవ్యం: ఈ దిశ ఈశాన్యం కన్నా మెరకగాను, ఆగ్నేయం కన్నా పల్లం గాను ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ అమరికకు వ్యతిరేకంగా ఉంటే, రోగ భయం, శత్రువృద్ది, స్త్రీసంతాన సమస్యలు, ప్రేమ వ్యవహారాలు, మానసిక ఆరోగ్య సమస్యలు,వెన్నుపూస సమస్యలు, టాన్సిల్స్ వంటి ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆర్దిక నష్టాలు, ఐ‌పి దాఖలు చేయడం వంటివి ఉంటాయి.ఆడ పిల్లలకు వివాహాలు సకాలం లో కావు, ఆడపిల్లల వివాహ జీవితంలో సమస్యలు వస్తాయి.
                                    శతృకర్త్రీ విరాగీ చ గోత్ర క్షయకరీ తధా
                                    గృహే చ కన్యకానాం హంత్రీ సదా దు:ఖ భయవహా.
                                                                                                అపరాజితపృచ్చ
కనుక వాయవ్యం తప్పనిసరిగా ఈశాన్యం కన్నా మెరకగా ఆగ్నేయం,నైరుతి కన్నా పల్లం గా ఉండాలి.
ఈ విధమైన అమరిక వలన సకల పీడలు నశిస్తాయి.
ఉత్తరం: సకల ఆర్ధిక శుభాలకు ఈ దిక్కే కారణం. ఇది కుబేర స్థానం. ఈ దిశ ఎప్పుడు పల్లంగా ఉండాలి. ఉత్తరమ్ నుండి ఉత్తర ఈశాన్యం వరకు ఆన్ని దిశల కన్నా పల్లంగా ఉంటే సిరిసంపదలు అనాయాసంగా ఒనగూడతాయి.పాండిత్య.శాస్త్ర విజ్ఞానం గృహస్తుకు కలుగుతుంది. ఇహ లోకంలో సుఖాలను పొందాలనుకుంటే ఈ దిశ తప్పనిసరిగా పల్లం గా ఉండాలి.
                                    పూజ్యా లాభకరీ నిత్యం పుత్ర పౌత్ర వివర్ధినీ
                                    కామదా భోగదా చైవ ధనదాచోత్తర  ప్లవా --- అపరాజితపృచ్చ
అన్నివిధాలైన ఇహలోక లాభాలకు,వంశవృద్దికి, ఇష్టకామ్య సిద్దికి అన్నీ భోగాలకు ఉత్తరం పల్లం గా ఉంచాలి. ఈ దిశ మెరక ఉంటే ధన నష్టం వ్యాపార విద్యా నష్టం, స్త్రీలకు వివాహం ఆలస్యం కావడం వంటి నష్టాలు కలుగుతాయి.. ఉత్తరమ్ మెరకగా ఉంటే ఆర్ధికాభివృద్దికి తీవ్ర ప్రతిబంధకం. కనుక సత్వర అభివృద్దికి ఉత్తరం పల్లంగా ఉండాలి.
ఈశాన్యం: ఇది అన్నీ దిశల కన్నా పల్లంగా తేలికగా ఉండాలి. ఈశాన్య పల్లం సకల సంపదలకు నిలయం. వంశవృద్దికి,ధనవృద్దికి  విద్యావృద్దికి ఈ దిశే కారణం. ఈశాన్యం పల్లంగా ఉంటే మగ పిల్లలు చక్కగా వృద్దిలోనికి వస్తారు.  మగవారు తమ భాద్యతల పట్ల అంకిత భావం తో ఉంటారు.
                                    వరసౌఖ్య సతీ సత్య సౌభాగ్యాది వివర్ధిని.
                                    ధనా:ఐశ్వర్య సంపన్న ధర్మ ఈశానక ప్లవా
                                                                                    అపరాజితపృచ్చ
పై శ్లోకం ప్రకారం ఈశాన్యం పల్లంగా ఉంటే సర్వతోముఖాభివృద్ది ఉంటుంది. మానవుడు సకల సౌఖ్యాలను పొందుతాడు. ఈశాన్యం మెరక ఉంటే తీవ్ర ఆర్ధిక సమస్యలు ఉంటాయి. యే రంగం లో ను కలసి రాదు. మగవారు అంతగా ప్రయోజకులు కాలేరు. కాన్సర్ వంటి రోగాలు వస్తాయి. కనుక మంచి జీవితానికి ఈశాన్యం పల్లం గా ఉండాలి.

పై విధమైన నియమాలను దృష్టి లోఉంచుకొని గృహ నిర్మాణాన్ని చేయాలి. ఆయా దిక్కులు వాటి ఎత్తుపల్లా ల నియమాలను దృష్టిలో ఉంచుకొని వాటిని పరస్పరం సమన్వయం చేసి గృహ నిర్మాణమ్ చేయాలి.ఈ నియమాలను అన్నీ నిర్మాణ విషయాలలో అంటే శ్లాబ్,ఫ్లోరింగ్, ప్రహరీ ఇంకా వసారాలు వంటి అన్నీ నిర్మాణాలలో పాటించాలి. ఈ విధం గా పాటిస్తే ఎంతో మేలు జరుగుతుంది. ఈ సూత్రాలను ఉల్లంఘిస్తే తిప్పలు తప్పవు. అందుకని వీటిని సమతౌల్యం చేసి అన్నీ నిర్మాణాలలో పాటించాలి. అప్పుడే సంపదతో పాటు సర్వతోముఖాభివృద్ది కలుగుతుంది.
సకల శుభాలను యే విధంగా పొందవచ్చో ఈ క్రింది శ్లోకం తెలుపుతుంది గమనించండి.
                                   
                                    అత్యంత వృద్దిదమ్ నృణా ఈశాన ప్రాగుదక్ ప్లవమ్
                                    అన్య దిక్షు ప్లవమ్ తేషాం శశ్వదత్యంత హానిదమ్.
                                                                                    నారద సంహిత.

ఈశాన్యం, తూర్పుమరియు ఉత్తరం పల్లంగా ఉంటే అత్యంత శుభం కలుగుతుంది. మిగిలిన దిక్కులు పల్లమైతే విపరీత మైన హాని కలుగు తుంది అని పై శ్లోకం తెలుపుతుంది.
కనుక ఎత్తుపల్లాల నియమాలను నిర్లక్ష్యం చేయకుండా వీటిని చక్కగా పాటించితే సకల విధమైన అభివృద్ది తప్పక కలుగుతుంది. వీటిని నిర్లక్ష్యం చేస్తే విపరీతమైన నష్టం అన్నీ విషయాలలో కలుగుతుంది.  ఈ నిజాన్నిగమనించి పాటించుట మంచిది.

             
                                                సూర్యదేవర వేణుగోపాల్ M.A (జ్యోతిష్యం)

No comments:

Post a Comment