Saturday 28 March 2020

కరోన వైరస్- చదవాల్సిన స్తోత్రాలు.







కరోన వైరస్- చదవాల్సిన స్తోత్రాలు..



ప్రస్తుతం కరోన వైరస్ ప్రపంచాన్ని గడగడ లాడిస్తోంది. హిందూ ధర్మ శాస్త్రాలలో ఇంకా గ్రంధాల్లో ఇటువంటి ఆపత్కర విపత్తులను అరికట్టడానికి ఎన్నో తరుణోపాయాలు సూచించారు. ఇటువంటి రోజుల్లో ఏయే స్తోత్రాలు చదవాలో ఈ క్రింద ఉదహరిస్తున్నాను. ఎవరికి వారు ఇళ్లలోనే ఉండి ఈ స్తోత్రాలను ఉదయం, సాయంత్రం పఠించండి. ఇవి స్వ రక్షణ తో పాటు దేశ రక్షణ కూడా ఉపకరిస్తాయి. పూర్తి నమ్మకం తో పఠించండి... ఈ స్తోత్రాలు అన్ని స్తోత్ర పుస్తకాలలో ఉంటాయి, లేకపోతే నెట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.


అన్నిటికన్నా ముఖ్యమైనది సంధ్యావందనం. సంధ్యావందన అర్హత ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దీనిని ఆచరించాలి. గాయత్రి మంత్రాన్ని విడిగా కాకుండా సంధ్యావందనం లో చేస్తే మంచి లాభం ఉంటుంది. ఇప్పుడు అందరూ ఇళ్లకు పరిమితమయ్యారు కాబట్టి రోజు సహస్ర గాయత్రి చేస్తే దేశానికి మేలు చేసినవారౌతారు. వీలుంటే  త్రిసంధ్యలు ఆచరించండి. లేకపోతే కనీసం ఉదయ సంధ్య, సాయం సంధ్యలలో ఆచరించండి. గాయత్రి మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువ సార్లు చేయండి అంటే జపసంఖ్యను పెంచండి. 11,24 కాకుండా 108,508,1008 లు గా చేయండి. మీకూ మంచిది దేశానికి మంచిది. ఈ విపత్తు నుండి త్వరగా విముక్తి వస్తుంది. సంధ్యావందన అర్హత ఉన్నవార్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మిగిలినవారు వేరే స్తోత్రాలు పఠించవచ్చు.


అందరూ విధిగా ప్రతిరోజూ "ఆదిత్య హృదయ "స్తోత్రాన్ని ఉదయం, సాయంత్రం రెండు పూటలా చదవండి. "ఆరోగ్యం భాస్కారాదిచ్చేత్"  అని మన గ్రంధాలు చెప్తున్నాయి. ఆరోగ్యం కోసం సూర్య భగవానుని ఆరాధించాలి. కరోన వైరస్ నుండి ప్రపంచాన్ని రక్షించమని ప్రతిరోజూ రవిని ఆరాధించాలి. అన్ని వర్ణాల వారు ఆదిత్య హృదయమును పఠించవచ్చు.


"శీతలా దేవి"  అన్ని రకాల విపత్తుల నుండి భూమిని కాపాడుతూ ఉంటుంది. ప్రతిరోజూ అందరూ రోజుకు రెండుసార్లు " శ్రీ శీతలా  దేవి స్తోత్రం" ను పారాయణం చేయాలి.  పఠించేవారిని వారి చుట్టూ ఉన్న పరిసరాలను ఈ తల్లి అన్ని ఆనారోగ్య విపత్తుల నుండి రక్షిస్తుంది.


అన్ని విపత్తులకు రక్షణ "శ్రీ లలిత సహస్రనామ స్తోత్రం" ఇది చాలా మహిమా కలిగినది. శ్రీవిద్యా సాంప్రదాయంలో అగ్రగణ్యమైనది. దీనిని రోజు రెండు సార్లు చదువుతూ ఉంటే స్వీయ రక్షణ సంఘ రక్షణ రెండు జరిగుతాయి. అన్ని సమస్యల నుండి విపత్తుల నుండి తన భక్తులను నిరంతరం కాపాడుతూ ఉంటుంది.  అయితే లలిత సహస్రనామ స్తోత్రాన్ని గురు ముఖంగా నేర్చుకొని పారాయణం చేయాలి.  తప్పులు లేకుండా చదవాలి. ఎందుకంటే అతి నిగూఢమైన శ్రీవిద్యా రహస్యాలు. ఇందులో పొందుపర్చబడినవి.


ఇంకా శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీ సుదర్శన మాహా స్తోత్రం, శ్రీ ఆంజనేయ బడబాలన స్తోత్రం, శ్రీ వారాహి స్తోత్రం, శ్రీ లక్ష్మి నృసింహ కరావలంబ స్తోత్రం మొదలగు స్తోత్రాలని ఎవరికి వీలైనవి వారు ఇంట్లో ఉండే చదివితే మంచి ప్రయోజనం ఉంటుంది.

"మహా మృత్యుంజయ మంత్రం, రుద్రం, మన్యు సూక్తం" వంటివి ఈ సమయాలలో చదవడం చాలా మంచిది. నవగ్రహ స్తోత్రం కూడా చాలా మంచిది.


ఈ సమయం లో "చండీ సప్తశతి" చాలా ముఖ్యం.  ఈ సంప్రదాయం లో ఉన్నవారు వీలైనన్ని ఎక్కువసార్లు పారాయణం చేయడం మంచిది. చండీ దయ ఉంటే ఎటువంటి విపత్తు సంభవించదు. ప్రభుత్వం వారు కూడా దేవాలయాల్లో "చండీ హోమం"  ప్రతి రోజు చేయించడం మంచిది.  ఎక్కువ దేవాలయాలలో రోజు చేయించాలి.


ప్రతి రోజు "శ్రీ దుర్గా సహస్రనామ స్తోత్రం" లేదా "దుర్గా స్తోత్రం" "కాళి స్తోత్రం" "కాళి కవచం" ఇంకా "శ్రీ దత్త పంజర స్తోత్రం" లేదా "శ్రీ దత్త సహస్రనామ స్తోత్రం" చదువుతూ ఉంటే అన్నీ విపత్తుల నుండి రక్షణ కలుగుతుంది.

ఇవే కాకుండా కుల దేవత ఆరాధన చేయడం మంచిది. ఇష్ట దేవత ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇస్తాయి.

పైన ఉదహరింపబడినవి ఎవరికి వీలైనవి వారు చదివి కరోన వైరస్ నుండి అందర్నీ రక్షించమని పరమాత్మని వేడుకుందాం.

No comments:

Post a Comment