Saturday 12 December 2015

ధ్యానం అంటే సహజత్వానికి చేరడమే.


ధ్యానం అంటే మనకు ఉండే సహజ స్థితికి మనం చేరడమే. దివ్యమైన చైతన్య స్థితే మన సహజ స్థితి. ధ్యానం యొక్క గమ్యం కూడా అదే. ఆ సహజస్థితి లో  వుండడమే నిజమైన ధ్యానం. సహజస్థితిని పొందడానికి కేంద్రీకృతం  కావడం ముఖ్యం. ధ్యాని తనకు తానుగా కెంద్రీకృతం కాబడి ధ్యానబిందువు గా మారాలి. ఇదే సహజత్వాన్ని పొందటానికి రహదారి. కేంద్ర బిందువు లో మౌనంగా స్థిరపడినప్పుడు మాత్రమే మన సహజస్థితి అనుభవం లోనికి వస్తుంది. అప్పుడే  జ్ణానం సంప్రాప్తమౌతుంది. ఈ కేంద్ర బిందువుకి చేరాలంటే నిరంతర సాధన, ధ్యానాన్ని గురించిన సరియైన అవగాహన ముఖ్యం.
ధ్యానం గంభీరంగా చేసేది కాదు. ధ్యానం గంభీరతను కోరదు. ధ్యానం అంటే మనకున్న సహజత్వాన్ని పొందడమే కదా. దీనికి అంత భయంకర నియమాలు , కటినమైన గంభీరత అవసరం లేదు. మన సహజ స్థితిని మనం ఇప్పటికే పొందివున్నాం. కనుక మనం చేయవలసిందల్లా ఆ బిందువుకు చేరడమే. మనస్సు తో చేసే ఏకాగ్రతా ధ్యానం పరమ గమ్యాన్ని చేర్చలేదు. ధ్యానం అంటే ఏకాగ్రత కాదు. ధ్యానం అంటే మనస్సుకు అతీతమైన స్థితి. విపరీతంగా చేసే ఏకాగ్రత  మనోతీత స్థితికి చేర్చలేదు. కనుక మనస్సుకు అతీతంగా ధ్యానాన్ని ఆచరించాలి. ఈ ప్రయత్నం  ఆలోచనరహిత స్థితిని ప్రసాదిస్తుంది. ఈ ఆలోచన రహిత  స్థితి మనిషిని తన కేంద్ర బిందువుకి చేర్చుతుంది. ఆలోచనలు పూర్తిగా లుప్తం అయినప్పుడే మనోతీత స్థితి లభ్యం అవుతుంది. మనోతీత మైన స్థితి గతం గురించిన ఆలోచలననుండి, భవిష్యత్ గురించిన చింతల నుండి దూరం చేసి  మనిషిని ఎల్లప్పుడు వర్తమానం లో కి సంచరింపజేస్తుంది. ఇదేయే నిజమైన ధ్యానం..  కనుక నిజమైన ధ్యానానికి మనస్సు దాని నుండి ఉద్భవించే ఆలోచనలు పూర్తిగా నశించాలి.
ఆలోచనలు లుప్తం కావాలంటే యేమి చేయాలి?  ఆలోచనలు నశించాలంటే మనం ఒక ప్రేక్షకునిలా మారి ఆలోచనలను గమనించాలి. ఆలోచనలకు కేవలం సాక్షి లా మారాలి. మనస్సును దాని నుండి జన్మించే ఆలోచనలను ,పరిసరాలను,ఇంకా మన ప్రతి కదలికను కేవలం ఒక సాక్షిగా మారి మన లోపలి నుండి పరిశీలించాలి. ఇటువంటి గమనిక అత్యంత శాంతి ని ప్రసాదిస్తుంది. నిరంతరం అన్నీ విషయాల పట్ల సాక్షిగా వుండటమే ధ్యానం యొక్క పరమార్ధం. ఈ విధమైన సాక్షి సాధన కేవలం అభ్యాస ,వైరాగ్యాల ద్వారా మరియు సరియైన అవగాహన ద్వారానే సాధ్యం కాగలదు.ఒక్కసారి మనం మన సహజత్వాన్ని పొందితే నిజమైన ఆనందం తేటతెల్లం అవుతుంది.మనోభ్రాంతి, ఇంకా చెప్పాలంటే సకల మాలిన్యాలు మట్టికలసి పోతాయి.ఇదేయే నిజమైన జ్ణాని, అవధూత, లేదా శ్రీకృష్ణ స్థితి.
ఈ విధమైన ధ్యానానికి గంటల తరబడి కూర్చోనవసరం లేదు. మనం మన దైనందిన భాద్యతలను నిర్వర్తిస్తూ కొంచం జాగురుకతతో మరికొంచెం స్పృహ తో వుంటే చాలు. ధ్యానం కోసం ఏకాంత ప్రదేశాలకు పోనవసరం లేదు. మన ప్రతి క్రియను జాగరూకతతో మన కేంద్రం నుండి నిర్వర్తించాలి. అప్పుడు  జీవితమే ధ్యానం గా  మారుతుంది. తదుపరి అన్ని విషయాల పట్ల నిస్సంగత్వమ్ అలవడి గీత లో కృష్ణ పరమాత్మ బొధించినట్లుగా తామరాకు మీద నీటి బిందువులా జీవితం మారిపోతుంది. ఇదియే బుద్దుని స్థితి.

ఆలోచనలు ,పరిసరాలు ధ్యానాన్ని ఎప్పుడూ భంగ పరుస్తూనే వుంటాయి. ఆలోచనలను అదిమిపెట్టడానికి ప్రయత్నం చేయకూడదు. అలాగే పరిసరాల నుండి పారిపోకూడదు. ఈ విధమైన ప్రయత్నాలన్నీ ఘర్షణలను సృస్టిస్తాయి. ఆలోచనలను పరిసరాలను ధ్యాని స్వీకరించాలి.  వీటిని అంగీకరిస్తూనే  విలువ ఎంతమాత్రం ఇవ్వరాదు. సాగిపోయే అలలు లాగా పరిశీలించాలి. ఎప్పుడైతె ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వమో  అప్పుడే అవి నశిస్తాయి. ఈ రహస్యాన్ని తెలుసుకొని ధ్యానాన్ని ఆచరించాలి. ఇదియే సహజ స్థితి ని పొందడానికి సులభమైన మార్గం. మనస్సుతో మరియు, ఆలోచన్లతోపాటుగా ధ్యాని ప్రయాణం చేయకూడదు. వాటిని జాగురూకతతో పరిశీలించాలి. ఈ ఆలోచనలు మనిషి యొక్క సహజత్వాన్ని భంగపరచలేవు అన్న సత్యాన్ని తెలుసుకోవాలి.ఇదియే నిజమైన ధ్యానం.
                                                          
                                                                                             
   

  venusuryadevara@gmail.com

No comments:

Post a Comment