Saturday 2 January 2016

వాస్తు విజ్ఞానం-8&9
స్థల ఎంపికలో వాస్తు నియమాలు- ఆంతర్యం
సూర్యదేవర వేణుగోపాల్  M.A (జ్యోతిష్యం)

నిర్మాణానికి స్థలం ముఖ్యం. సేకరించిన స్థలం నిర్మాణానికి అనువుగా ఉండాలి. స్థలం వాస్తు ప్రకారం ఉంటే నిర్మాణం కూడా దాదాపుగా వాస్తుకు అనుగుణంగానే ఉంటుంది. కనుక స్థలం తప్పనిసరిగా వాస్తుకు ఉండాలి. స్థలం తీసుకొనేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని స్థలాలు నిర్మాణానికి పనికి రావు. నిర్మాణానికి పనికివచ్చే స్థలం లోనే మనం గృహాన్ని నిర్మించాలి. స్థల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వాస్తు చెపుతుంది. చాలా నియమాలను వాస్తు నిర్దేశించింది. మనిషికి మెరుగైన, ఆరోగ్య ప్రదమైన జీవితం ఇవ్వడమే ఈ వాస్తు నియమాల వెనుక గల ఆంతర్యం. వీటిని మూఢ నమ్మకంగా కొట్టిపారవేయకూడదు. అన్నింటిని పాటించడం నేటి కాలంలో కష్టం. కనుక కొన్ని ముఖ్యమైన, ప్రాధమికమైన నియమాలను తప్పనిసరిగా పాటించాలి. లేని పక్షంలో నష్టాలు కలుగుతాయి. స్థల సేకరణలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు పరిశీలిద్దాం.
స్థలం లో లోపాలు ఉన్నప్పటికి వాటిని వాస్తు ప్రకారం సవరించడానికి వీలుంటే వాటిని తీసుకోవచ్చు. సవరించడానికి వీలులేని వాస్తు దోషం ఉన్న స్థలం నిర్మాణానికి పనికిరాదు. దక్షిణం, పడమర, మరియు నైరుతి ప్రాంతంలందు సవరించుటకు వీలు లేనంతగా పల్లం ఉంటే అటువంటి స్థలాన్ని తీసుకోకూడదు. ఈ దిక్కులందు నదులు, నీటి ప్రవాహం, లేదా బావులు ఇంకా పూడ్చలేనంత గోతులు ఉంటే ఇటువంటి స్థలం నిర్మాణానికి పనికి రాదు. ఇటువంటి స్థలాలలో గృహాలను నిర్మిస్తే అనేక ఉపద్రవాలు ఏర్పడతాయి. తీవ్ర నష్టాలు వస్తాయి. ఈ దిక్కులందు గుంటలు లేదా బావులు ఉంటే సమస్యల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఈ దిక్కులు పల్లం అయితే మానవ మనుగడ కష్టతరం అవుతుంది. చెడును కలిగించే దిశల బలం పెరుగుతుంది. దీనివల్ల మనిషి జీవితం ప్రశాంతంగా ఉండదు. కనుకనే  ఈ వాస్తు నియమాన్ని మహర్షులు చెప్పడం జరిగింది. ఈ క్రింది శ్లోకం గమనించండి.....
నశ్యన్తి పురుషాస్తత్ర దేవతాచ ప్రణశ్యతి
ధన హానింకరో నిత్యం రోగకృత్ దక్షిణ ప్లవ:    
ప్రవర్తయే గృహే పుంసాం రోగాశ్చ మృత్యుదాయకాన్
ధనహానిమ్తధానిత్యంకురుతేనైరుతి ప్లవా                                                                       
పశ్చ్హిమే చ ప్లవా భూమి ధనధాన్య వినాశిని
శోకదాహ్యామ్ కులం తత్ర యత్ర భూ:పశ్చ్హిమే ప్లవా.
                                      - “ అపరాజితపృచ్చ”
“అపరాజితపృచ్చ” అనే ప్రాచీన వాస్తు గ్రంధం నుండి పై శ్లోకం తీసుకోబడింది. ఈ శ్లోకం ప్రకారం దక్షిణం పల్లం అయితే ధననష్టం, రోగభయం  ఉంటుంది  ఇటువంటి స్థలంలో దేవుడు కూడా రాణించలేడని తెలుపుతుంది. ఇంకా పశ్చిమం పల్లం అయితే ధన ధాన్య నష్టం, నిత్యం శోకం కలుగుతుందని, నైరుతి పల్లం అయితే మృత్యుభయం, ధననష్టం  మరియు ప్రవర్తనా దోషాలు కలుగుతాయని తెలుపుతుంది. బావులు, నీటిప్రవాహాలు గుంటలు మొ| వాటి వలన భూమి  పల్లం  అవుతుంది. కనుక స్థలానికి దక్షిణం,పశ్చిమం మరియు నైరుతి పల్లం గా ఉన్న స్థలాలను కొనరాదు. ఈ పల్లాన్ని సవరించుకొనే వీలు ఉంటే స్థలాన్ని తీసుకొని వెంటనే మెరక చేయాలి. గృహ నిర్మాణానికి పూర్వమే సవరించాల్సి ఉంటుంది.
ఈశాన్య, తూర్పు మరియు ఉత్తర దిశలందు సవరించడానికి వీలు లేనంత ఎత్తైన కట్టడాలు గాని, పర్వతాలు గాని లేదా రాళ్ళు గాని ఉంటే ఈ స్థలం అంతగా కలసిరాదు.  ఈ స్థలం ధననష్టాన్ని కలిగిస్తుంది. మగవారికి కలసిరాదు.ఈ వాస్తు అమరిక వలన శుభాలను ప్రసాదించే దిక్కులైన తూర్పు,ఉత్తరం, మరియు ఈశాన్యాలు  తమ బలాన్ని కోల్పోతాయి. దీని వలన సుఖప్రదమైన జీవితం లోపిస్తుంది. అందుకొనే ఇటువంటి స్థలాలను కొనేటప్పుడు అధిక జాగ్రత్తను పాటించాలి. అయితే స్థలాన్ని సవరించి శుభ దిక్కులకు బలాన్ని చేకూర్చే వీలుంటే  తీసుకోవచ్చు. వీధి శూలలు ఉన్న స్థలం పనికిరాదు. నైరుతి, ఉత్తర వాయవ్యం, తూర్పు ఆగ్నేయం నుండి వీధి శూలలు ఉన్న స్థలం పనికిరాదు. ఈ వీధి శూలలు వలన మృత్యు భయం, ఆర్ధిక నష్టం, ఆరోగ్య నష్టం సంతానం తో సమస్యలు మున్నగు ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ వీధి శూలలు పడే మేరకు స్థలం వదలి గృహాన్ని నిర్మించే వీలు ఉన్నప్పుడు తీసుకోవచ్చు. వాణిజ్య ప్రాంతం,మెయిన్ రోడ్ లో ఉన్న స్థలానికి ఈ వీధి శూలలు ఉంటే వాస్తు లో చెప్పబడిన పరిహారాలు పాటించి ఇందులో నిర్మాణం చేయవచ్చును. ఏదిఏమైనా వీధి శూలలు ఉన్న స్థలం నిర్మాణానికి మంచిది కాదు. వీధిచూపులున్న స్థలాలు లాభాన్ని కలిగిస్తాయి. తూర్పు,ఉత్తర ఈశాన్యం, దక్షిణ ఆగ్నేయం, మరియు పశ్చిమ వాయవ్యం నుండి వీధి చూపులుంటే ఇటువంటి స్థలాలను తీసుకోవచ్చు. ప్రవాహ శూల ఉన్న స్థలం కూడా మంచిది కాదు. ప్రవాహ శూల ఏ దిశలోనూ స్థలానికి తగులకూడదు.  ఈ జాగ్రత్త లన్ని గృహస్థుకు సుఖాన్ని కలిగించడానికి చెప్పబడినాయి.
ఆలయ శిఖరం మరియు ధ్వజ స్తంభం నీడ పడే స్థలాలు మంచివికావు. వీటి నీడ వలన జీవితాలు అభివృద్దికి నోచుకోవు. కనుక ఇటువంటి స్థలాలను తీసుకో రాదు. తప్పనిసరి పరిస్థితులలో తీసుకోవలసి వచ్చినప్పుడు వీటి నీడ పడే మేరకు స్థలం వదలి గృహాన్ని నిర్మించాలి. విష్ణు ఆలయాలకు వెనుక భాగంలో, శివుని ఆలయానికి ఎదురుగా మరియు దేవి ఆలయాలకు పార్శ్వ భాగంలో ఉన్న స్థలాలు మంచివి కావు. ఇటువంటి స్థలంలో గృహాన్ని నిర్మించి నివశిస్తే అనేక నష్టాలు ఏర్పడి జీవితంలో అభివృద్ది ఉండదు. కాబట్టి ఇటువంటి స్థలాలను వదలివేయుట మంచిది. కానీ నేటి పరిస్థితులలో ఈ విధంగా వదలివేయుట చాలా కష్టం. కనుక  వీటి ఛాయ పడిన మేరకు స్థలంను వదలి మిగిలిన స్థలంలో గృహం నిర్మించుకోవచ్చును.ఈ క్రింది శ్లోకం పరిశీలించండి..
శివదృష్టి,ర్విష్ణుపృష్టంచ, దుర్గాయా పార్శ్వతో దృశమ్
విఘ్నేశ స్యోర్ద్వ దృష్టించ, తీక్షణ మాహు ర్మనీషీణా
                                                “భృగు మహర్షి “
శివాలయానికి ఎదురుగా ఉండే ఇంటికి శివ దృష్టి వేధ కలుగుతుంది. విష్ణు ఆలయాలకు వెనుక భాగంలో ఉండే గృహానికి విష్ణు వేధ కలుగుతుంది. విఘ్నేశునుకి  ఉర్ద్వ దృష్టి ఉంటుందని భృగు మహర్షి వివరించారు. ఎత్తుగా ఉండే నిర్మాణాలకు సమీపంలో గణేశ్ ఆలయం ఉంటే గణపతి వేధ  కలుగుతుంది. ఆలయప్రహరికి ఇంటికి మధ్య  కనీసం 18 నుండి 20 అడుగుల  వెడల్పుతో రోడ్ తీసి మిగిలిన  స్థలంలో ఇంటిని నిర్మిస్తే దేవతా వేధలు ఉండవు. కనుక ఆలయాల సమీపంలో ఇంటిని నిర్మించేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి . ఈ నియమాలన్నీ మానవుని ప్రశాంతతకు కోసం రూపొందించబడినాయి. ఆలయాలకు దగ్గరగా ఉంటే జన సమ్మర్ధం ఎక్కువుగా ఉంటుంది. ప్రశాంతతకు భంగం ఉంటుంది. అందుకనే ఇటువంటి నియమాలు రూపొందించబడినాయి. గృహంలో జరిగే కార్యక్రమం వేరు ఆలయంలో ఉండే కార్యక్రమం వేరు. గృహాలలో జరిగే శుభ, అశుభ కార్యక్రమాల వల్ల ఆలయంలోని దేవునికి, ఇంకా ఆలయం ను సందర్శించే భక్తులకు మైల, ఇతర సమస్యలు రాకుండా వుండడానికే ఆలయాలకు దూరంగా ఉండాలని  వాస్తు చెపుతుంది

స్థలాలు కొనే ముందు స్థలం ఎక్కడ ఉన్నదో జాగ్రత్తగా పరిశీలించాలి. నైసర్గిక వాస్తు చాలా ముఖ్యమైనది. మన స్థలంలో  ఎటువంటి మార్పునైనా చేసుకోగలం. కానీ మన చుట్టూ ఉన్న పరిసరాలను మార్చలేము. కనుక నైసర్గిక వాస్తును గమనించాలి. పరిశ్రమలు, పెద్ద నిర్మాణాల విషయంలో మరీ జాగ్రత్త అవసరం. ఎందుకంటే స్థలనిర్ణయంలో పొరపాట్లు జరిగితే పరిశ్రమలు దానిపై ఆధారపడి జీవించేవారు తీవ్రంగా నష్టపోతారు. శుభాలను కలిగించే దిశలు బలంగా ఉన్న స్థలాలను ఎంచుకోవాలి. నష్టాలు కలిగించే దిశలు బలహీనంగా ఉండే స్థలంలో ఇటువంటి నిర్మాణం చేయాలి. శుభాలను ప్రసాదించే తూర్పు ఉత్తరం ఈశాన్య భాగాలు పల్లంగా ఉండి  దక్షిణం,పశ్చిమం ప్రాంతాలు మెరకగా ఉన్న స్థలాలో పరిశ్రమలు నిర్మించాలి. ఇటువంటి స్థలాలకు తూర్పు,ఉత్తరం, ఈశాన్య ప్రాంతాలలో నదులు, నీటి ప్రవాహం ఉంటే బాగా రాణిస్తాయి. పరిశ్రమలు స్థాపించేటప్పుడు దక్షిణ,పశ్చిమ నైరుతి దిక్కులలో ఎత్తైన పర్వతాలు, నిర్మాణాలు ఉన్న స్థలాలను ఎంచుకోవాలి.
శ్మశానాలు ప్రక్కన ఉన్న స్థలం మంచిదికాదు. ఇటువంటి స్థలంలో నివశిస్తే మానసిక ఆందోళనలు, సమస్యలు వస్తాయని వాస్తు ఈ విధంగా నిర్దేశిస్తుంది. ఇంకా నది తో కోత పడిన స్థలం, పిడుగులు పడిన స్థలం, కుళ్లిన జంతు కళేబరాలు ఉంచే స్థలం, ఊడలు దిగిన వృక్షం ఉన్న స్థలం, కొండ యొక్క పాదం దగ్గర ఉండే స్థలం, కొలిమి పెట్టిన స్థలం, గానుగా సున్నం ఆడించిన స్థలం, విపరీతమైన రద్దీ,  జనసమ్మర్ధం ఉండే స్థలం, పుట్టలు,బొరియలతో నిండి ఉన్న స్థలం  మంచివి కావని వాస్తు చెపుతుంది. ఈ ఆదేశాలన్నీ మనిషి రక్షణ కోసం చెప్పబడినవి. కనుక యధాతధంగా కాకపోయిన, వీటిలో కొన్నిటి నైనా పాటించుట మంచిది.కొత్త స్థలం కొనే ముందు వర్గు ను కూడా పాటించితే మంచి ఫలితాలు ఉంటాయి.
ప్రస్తుత పరిస్థితులలో ఇన్ని వాస్తు నియమాలు పాటించడం కష్టం. కనుక ముఖ్యమైన వాస్తు నియమాలలో రాజీ పడకుండా స్థలంను ఎంపిక చేసుకోవచ్చు. కొన్నివాస్తు దోషాలు స్థలంలో ఉన్నాయి అని భావిస్తే అటువంటి స్థలంలో కనుక నిర్మాణం చేయవలసి వస్తే గృహ నిర్మాణానికి ముందే ఆ స్థలాన్ని దున్నించి నవధాన్యాలు వేయాలి. ఇంకా అటువంటి స్థలంలో కనీసం మండలం రోజుల పాటు ఆవులను ఉంచాలి. దోషాలు తొలగిపోతాయి. ఎటువంటి స్థలం అయిన గృహస్తుకు చిత్త శాంతిని ప్రసాదించాలి. అటువంటి స్థలంలో గృహాన్ని నిర్మించుకోవాలి.  ఈ శ్లోకాన్ని గమనించండి.......
మనస చక్షుషో ర్యత్ర సంతోషో జాయతే భువి
తస్యాం కార్యం గృహం సర్వైరీతి గర్గాది సమ్మతం
                                    “వసిష్ట సంహిత.”
యజమాని మనసుకు, చూపులకు ఏ భూమి సంతోషమును కలిగిస్తుందో ఆ స్థలలంలోనే ఇంటిని నిర్మించాలని గర్గాది మహర్షులు చెప్పారని దీని భావం. ఈ శ్లోకం కూడా గమనించండి...
మనోరమా చ యా భూమి పరిక్షేత ప్రయత్నత:
సర్వేషాం చైవ వర్ణానాం సమభూమి సుభావహా.
                                    “విశ్వకర్మ ప్రకాశిక”
ఏ భూమి యజమానికి మనోహరంగా ఉంటుందో దానిని పరిక్షించి గృహాన్ని నిర్మించాలని, ఎత్తుపల్లాలు లేని శాస్త్ర దూష్యం కానీ స్థలంలో ఇల్లుకట్టాలని దీని భావం. కనుక ఏ స్థలం మనసుకు ప్రశాంతతను ఇస్తుందో అటువంటి స్థలం లోనే గృహనిర్మాణం చేయాలని మన మహర్షులు ఉపదేశించారు.
నేటి కాలంలో స్థలం కొనుక్కునే ఇల్లు కట్టలంటే విపరీతమైన ఖర్చుతో కూడిన పని. అన్ని వాస్తునియమాలు పాటించి స్థలం కోనాలంటే నేటి కాలంలో కొంచెం కష్టం. కనుక ప్రధానమైన వాటిని పాటించి చిన్న చిన్న దోషాలుంటే సవరించి స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవచ్చు. వాస్తు నియమాలన్నీ మనిషి కి ప్రశాంతతను మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి ఉద్దేశించబడినవి. వీటిని పాటించుట ద్వారా మంచి జీవితం ఉంటుంది.
సూర్యదేవర వేణుగోపాల్

 venusuryadevara@gmail.com 
సూర్యదేవరవేణుగోపాల్. M.A(జ్యోతీష్యం) H.NO-1-879

సుందరయ్య నగర్  మధిర  ఖమ్మం జిల్లా 

No comments:

Post a Comment